కార్తీకమాసంలో ఏతిథి రోజున ఏంచేయాలి..?

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి
న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం
న దేవః కేశవాత్పరః
అంటే కార్తీక_మాసం లోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం…
కార్తీక శుద్ధ పాడ్యమి : తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. ఆ తరువాత మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట.
విదియ: ఇవాళ సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: ఈరోజు పార్వతీ దేవి(అమ్మవారి రూపం)కి కుంకుమ పూజ చేయాలి. స్త్రీలకు సౌభ్యాగ్యం సిద్ధిస్తుందట. అందుకే ఇవాళ పార్వతీ దేవీకి పూజ చేస్తారు.
చవితి: నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరు స్వామిని పూజించి పుట్టలో పాలు పోయాలి. చెవి సంబంధిత, కాల సర్పదోషాలు ఏమైనా ఉంటే పోతాయని పురాణాలో చెప్పబడ్డాయి.
పంచమి: దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. అర్చనలు, అభిషేకాలు, చేయించుకున్న వారికి జ్ఞానం కలుగుతుందంని మన పూర్వీకులు ఎప్పటి నుంచో పాటిస్తున్న సిద్ధాంతం ఇది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ పద్దతి ఏప్పటి నుంచో మన పూర్వీకులు చేస్తున్న పద్దతిని అందరూ చేస్తూనే ఉన్నారు. ఇది ఎక్కువగా రాజస్థానీయులు, మార్వడీస్ పాటిస్తుంటారు.
సప్తమి: ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి: ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి: నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి: నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి: దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ రోజు సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుందని ప్రతీతి.
త్రయోదశి: సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. మన పెద్దలు ఇప్పటి దానాలు చేస్తారు.
చతుర్దశి: పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. ఈ రోజు ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు దానం చేస్తే శనిగ్రహము సంతృప్తి చెందిన మనకు శుభాల్ని కలుగచేస్తాడని ప్రతీతి.
కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది. (తోట కూర దానం చేస్తే మంచిదని అంటారు)
విదియ: ఈ రోజు ఏదైనా సుందరమైన ప్రదేశంలో వన భోజనాలు చేస్తే మంచిదని అంటారు. తద్వారా బంధుత్వాన్ని కలుపుకోవచ్చు.
తదియ: పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి: రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : సాధారణంగా ఊరి పొలిమేరల్లో గ్రామదేవతలకు పూజ చేస్తారు. పండిన పంటను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
సప్తమి: జిల్లేడు పూల దండను శివునికి సమర్పిస్తారు. శివుడికి ప్రీతికరం
అష్టమి: కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి: అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి: విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి: ఈరోజున శని ప్రభావం ఉన్న వాళ్లు నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి: ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.