కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్ర అరెస్ట్

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్ర అరెస్ట్
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో హింసాత్మక ఘటన జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటనపై రైతులు, ప్రతిపక్షాలు గొడవ రాస్తారోకోలు, బంద్ చేసిన విషయం తెలిసిందే. ఘటనకు కారకుడైన ఆశిష్ మిశ్రని అరెస్ట్ చేయాలని రైతులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. మొత్తం 8 మంది మృతి చెందారు.
ఈ ఘటనపై పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆశిష్ మిశ్ర పేరును చేర్చారు.
ఈ ఘటనలో శుక్రవారమే ఆశిష్ మిశ్ర పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.. కానీ, అనారోగ్యం కారణంతో నేను హాజరుకాలేనని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట ఆశిష్ హాజరయ్యారు. ఆశిష్ మిశ్రాని 11 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశారు. అయితే ఈ విచారణలో ఆశిష్ పోలీసులకు సహకరించలేదని సమాచారం. దీంతో పోలీసులు ఆశిష్ మిశ్రాను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ మొత్తం అట్టుడికిపోతోంది.
హింసాత్మక ఘటనలకు దారితీసిన కారణాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా మాత్రం మరోలా చెబుతున్నారు. నా కొడుకు ఈ సంఘటనా స్థలంలో లేడని.. అంతేకాదు నిరూపించడానికి తన వద్ద ఫోటో, వీడియో ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇదంతా నా కొడుకును ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ హింస్మాతక ఘటనలు జరిగే సమయంలో తన కుమారుడు డిప్యూటీ సీఎం వేదిక వద్ద ఉన్నారని, వేలాది మంది ప్రజలు, పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని ఆయన తెలిపారు.
మరోవైపు లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసును నుంచి తన కొడుకు రక్షించుకునేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించడం చాలా దారుణమని.. కాంగ్రెస్, బిఎస్పి, ఎస్పి సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి. ఈ కేసుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.