మాస్ మహారాజ రవితేజ కెరీర్లో మర్చిపోలేని బ్లాక్బస్టర్ చిత్రాల్లో ‘భద్ర’ ఒకటి. 2005 మే 12న విడుదలైన ఈ సినిమా, సోమవారంతో 20 యేళ్ళు పూర్తిచేసుకుంది. రవితేజ కెరీర్కు ఇది కీలక మైలురాయి. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజకు జోడీగా మీరా జాస్మిన్ నటించగా, ప్రకాశ్ రాజ్, సునీల్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రల్లో మెరిశారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “తిరుమల వాసా”, “ఓ మనసా” లాంటి పాటలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. ఫ్యాక్షన్ తో పాటు ప్రేమకథ మిక్స్ చేస్తూ, బోయపాటి తన స్టయిల్లో ఈ సినిమాను తీర్చిదిద్దారు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఈ సినిమా, రవితేజకు మాస్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చింది.
ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో భద్ర మూవీని గుర్తు చేసుకుంటూ చిత్ర బృందం, రవితేజకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ మూవీ సీన్స్, పాటలు, జ్ఞాపకాలు వైరల్ అవుతున్నాయి.