మెడికల్ మాఫియా… దోచేస్తున్నారు !

Healthy Life Latest Posts Top Stories

పేషంట్లను దోచేస్తున్న మెడికల్ మాఫియా
నిజామాబాద్‌లో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు
పేద, మధ్యతరగతి జనం నుంచి దోపిడీ

నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో చికిత్స కోసం హాస్పిటల్స్ లో చేరుతున్న రోగుల నుంచి అందినంత దోచుకుంటున్నాయి కొందరు యాజమానులు. రోగి బతకాలన్న ఆశతో ఉంటే, ట్రీట్మెంట్ ఖర్చుల పేరు చెప్పి లక్షల రూపాయల డబ్బులు గుంజుతోంది మెడికల్ మాఫియా . వైద్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా తయారు చేశారు కొందరు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు. ప్రజల ఆరోగ్యాన్ని అవకాశంగా మార్చుకొని, రోగులకు అర్థం కాని టెస్టులు, మందులు, చికిత్సల పేర్లతో భయపెట్టి అందినంత దోచుకుంటున్నారు.
నిజామాబాద్ సిటీలో ప్రస్తుతం దాదాపు 300కి పైగా స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రతి హాస్పిటల్ లోనూ ఔట్‌పేషెంట్ విభాగాల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. డాక్టర్‌ నాడి పట్టుకోవాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. ట్రీట్మెంట్ కోసం వచ్చే ప్రతి రోగి ముందుగా డిపాజిట్ పేరుతో రూ.30 వేల నుంచి లక్ష రూపాయల దాకా చెల్లించాలి. టెస్టులు, స్కానింగ్స్, సెలైన్‌లు, ఐసీయూ అడ్మిషన్లతో బిల్లులు లక్షల్లోకి వెళ్లిపోతున్నాయి. అసలు అవేమీ అవసరం లేని రోగులకీ అత్యవసర చికిత్సల పేరిట ఖర్చులు పెట్టిస్తూ, డబ్బులు దండుకొని వదిలేస్తున్న మాఫియాను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, జిల్లాలోని హాస్పిటల్స్‌లో చాలా వరకు మార్కెటింగ్ వ్యవస్థ ఆధారంగా పేషంట్లు వచ్చేలా బిజినెస్ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పేషంట్లను తెచ్చే ఆర్ఎంపీలు, పీఎంపీలు, హాస్పిటల్స్ కి పేషంట్స్ కట్టే బిల్లులో 30–40 శాతం వరకూ కమీషన్ అందుకుంటున్నారు. మెడికల్ షాపులు, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్లు అందరికీ ఇదే దారి. హాస్పిటల్ యాజమాన్యాలు కూడా వీరికి లక్షల్లో టార్గెట్లు పెట్టి, రిఫరల్స్ తెస్తే ట్రిప్స్, డిన్నర్లు లాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. దీంతో వీళ్ళు మానవతా దృక్పథాన్ని వదిలిపెట్టి, ప్రతి రోగిని కేవలం డబ్బుతో వస్తున్న యంత్రంగా మార్చేశారు.

ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా దందా

హాస్పిటల్ లో చేరినప్పటి నుంచే పేషెంట్ నుంచి దోపిడీ ప్రారంభమవుతుంది. అంబులెన్స్ మొదలుకుని, ప్రతి మెడికల్ టెస్ట్ వరకు, ప్రతి మందు వరకు రోగిపై అదనపు భారం పడుతోంది. కమీషన్‌ వల్ల పేషెంట్ల నుంచి దోపిడీ చేస్తున్నాయి. “ప్రైవేట్ హాస్పిటల్స్ లో పేషంట్లకు వేసే బిల్లుల విషయంలో ఫిర్యాదు వస్తే, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ హామీ ఇచ్చారు. అయినా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రైవేట్ మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు.

 

Tagged

Leave a Reply