ఇండో పాక్ టెన్షన్ – 7న సివిల్ మాక్ డ్రిల్ – రెడీగా ఉండండి!

Latest Posts Top Stories Trending Now

యుద్ధ మేఘాల మధ్య దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్లులు – ప్రజలకు కేంద్రం హెచ్చరిక

పాకిస్థాన్‌-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ క్షణం యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది.

సివిల్ మాక్ డ్రిల్స్ – ఎందుకు ?

పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నెల 7న అన్ని రాష్ట్రాల్లో “సివిల్ మాక్ డ్రిల్” నిర్వహించాలని ఆదేశించింది. ఇది యుద్ధం వచ్చినట్లయితే లేదా వైమానిక దాడులు జరిగినపుడు ప్రజలు ఎలా స్పందించాలి, ఎలా రక్షణ పొందాలి అనే విషయాల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రయత్నం.

ప్రజలు ఎక్కడ దాక్కోవాలి? ఎలాంటి ప్రదేశాలు సురక్షితం? బాంబు దాడులు జరిగినప్పుడు ఎలా తక్షణంగా స్పందించాలి? ఇవన్నీ ప్రజలకు నేర్పించడానికే ఈ డ్రిల్లులు. ఈ క్రమంలో ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరెన్లను వినిపించనున్నాయి. సాధారణ పౌరులు, విద్యార్థులు ఇలా అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది.

సివిల్ మాక్ డ్రిల్ అంటే ఏమిటి?

సివిల్ మాక్ డ్రిల్ అనేది పౌర రక్షణ లేదా విపత్తుల నిర్వహణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేసే ప్రాక్టీసు. భూకంపం, వరదలు, ఉగ్రదాడులు, రసాయన లీకేజీలు, లేదా యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై ఇది తాలిమ అందిస్తుంది.

ఈ డ్రిల్లుల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు, జాతీయ (NDRF), రాష్ట్ర విపత్తు బృందాలు (SDRF), స్థానిక పాలన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయడం, గాయపడిన వారికి తొందరగా వైద్య సహాయం అందించడం, కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించడం వంటి అంశాలపై దృష్టి ఉంటుంది.

జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటికే ప్రారంభం

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, అక్కడి ప్రజలకు మరింత సన్నద్ధత కల్పించేందుకు సివిల్ డిఫెన్స్ డ్రిల్లులు ప్రారంభించారు. ఢిల్లీ, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే NDMA ఆధ్వర్యంలో మెగా డ్రిల్లులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశమంతటా ఈ మాక్ డ్రిల్లులను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయపడకూడదు. కానీ జాగ్రత్త అవసరం. ప్రభుత్వ సూచనలు, డ్రిల్లుల్లో పాల్గొనడం ద్వారా ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. అలానే, దేశం తరఫున మనం సైతం అప్రమత్తంగా ఉండాలి.

ప్రధాని మోడీ కీలక భేటీలు – పాకిస్థాన్ పై ప్రతీకారం ఏ దిశగా?

ఇక, పాకిస్థాన్‌పై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అత్యున్నత స్థాయి భద్రతా అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల భారత వైమానిక దళ అధిపతి చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీ దేశ రాజధానిలోని ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగింది. దాదాపు గంటపాటు సాగిన ఈ చర్చల్లో పలు కీలక భద్రతా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Tagged

Leave a Reply