ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “రాజాసాబ్” చిత్రీకరణ దశలో ఉండగా, మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” గురించి నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ రాబోయే 2–3 నెలల్లో ప్రారంభమవుతుందని, 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
ఇంతకుముందు “యానిమల్”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, “యానిమల్ పార్క్” తరువాత ప్రభాస్తో కలిసి “స్పిరిట్” అనే పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నాడు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. కొన్ని రోజులుగా “స్పిరిట్” ఆలస్యం అవుతుందన్న వార్తలపై తాజాగా నిర్మాత భూషణ్ ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
హను రాఘవపూడి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వాల్లో పలు ప్రాజెక్ట్లు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నా, త్వరలోనే తిరిగి వచ్చి “రాజాసాబ్” షూటింగ్ పూర్తి చేస్తారట. ఆ తరువాత వెంటనే “స్పిరిట్” ప్రాజెక్ట్ మొదలవుతుందని సమాచారం.