హైదరాబాద్ లో గలీజ్ ఫుడ్.. తిన్నారంటే రోగాలే !

Latest Posts Top Stories Trending Now

గతంలో వీకెండ్స్ లోనే హైదరాబాద్ లో రెస్టారెంట్స్, హోటల్స్ బిజీ… బిజీగా ఉండేవి. కానీ ఈమధ్య కాలంలో ఏ రోజు చేసినా హోటల్స్ మస్తు గిరాకీతో నడుస్తున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ యాప్స్ లో ఆర్డర్లు మాత్రమే కాదు… బయట సెంటర్లలో ఫుడ్ ఐటెమ్స్ కోసం జనం భారీగా క్యూలు కడుతున్నారు. ఆ రష్ చూస్తే… అసలు వీళ్ళ ఇళ్ళల్లో కిచెన్స్ ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వస్తాయి. హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ ఆకర్షణీయంగా, టేస్టీగా ఉంటే సరిపోదు… అసలు దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేస్తున్నారు… ఫుడ్ ఐటెమ్స్ లో వాడే పదార్థాలు నాణ్యమైనవేనా ? ఎక్స్ పైరీ డేట్ ఉందా అనేది ఎవరూ చూడటం లేదు. అదే ఇప్పుడు హైదరాబాదీలకు రోగాలను తెచ్చిపెడుతోంది.

Hyderabad Food

గత ఐదారు నెలలుగా హైదరాబాద్ లోని హోటళ్ళు, రెస్టారెంట్స్, దాబాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీటిల్లో గొప్ప గొప్ప పేరున్నవి, సినిమా నటులు, ఇతర ప్రముఖులు నడుపుతున్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. టీ పౌడర్ దగ్గర నుంచి వంట నూనె దాకా, మసాలాలు, కారాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ ఇలా అన్నీ డేట్ దాటిన ఐటెమ్స్ బయటపడుతున్నాయి. ఇంక కుళ్ళిన మాంసం, చికెన్, మటన్ తోనే బిర్యానీలు వండి వడ్డిస్తున్నాయి చాలా హోటల్స్. ఈ రెస్టారెంట్స్ లో కిచెన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పురుగులు, ఈగలు, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు కామన్ గా మారాయి. వాటి పని వాటిదే. చెఫ్ ల పని చెఫ్ లదే అన్నట్టుగా ఉంది. పేరున్న ప్రముఖ రెస్టారెంట్స్ దగ్గర నుంచి గల్లీల్లో ఉండే ఫుడ్ కోర్టుల దాకా చాలా వాటిల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లో సోదాలు నిర్వహించి, ఫోటోలు, వీడియోలను మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. వాటిని ఎక్స్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

నోటీసులకే పరిమితం !

రెస్టారెంట్స్, హోటళ్ళలో నాణ్యతపై తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆయా సంస్థలకు నోటీసులు మాత్రమే ఇస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. లేదంటే కొన్ని హోటళ్ళపై నామమాత్రంగా పెనాల్టీలు వేస్తున్నారు. ఇదంతా మీడియా ముందు హంగామాకే పరిమితం అవుతోంది. ఆ తర్వాత ఆ రెస్టారెంట్స్ యధావిధిగా తమకు నచ్చిన రీతిలో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ, హైదరాబాద్ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించని హోటళ్ళ యాజమానులకు శిక్షలు ఉండవా ? ఇప్పుడు జనం ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆ రెస్టారెంట్ల లైసెన్సులు ఎందుకు రద్దు చేయట్లేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్ళ కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 3 వేలకు పైగా హోటళ్ళ యజమానులకు నోటీసులు ఇచ్చారు. కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరికీ జైలు శిక్ష పడలేదు. ఎవరి లైసెన్స్ రద్దు కాలేదు. కేవలం ఫైన్లు కట్టి బయటపడ్డారు చాలామంది. ఆ తర్వాత వాళ్ళు ఆడింది ఆటగా సాగుతోంది.

Hyd fod

చట్టం ఏం చెబుతోంది ?

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ యాక్ట్ 2006 ప్రకారం ఆహారాన్ని కల్తీ చేసే వారికి చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయి. వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు భారీగా జరిమానాలు వేసే అధికారం ఉంది. వంటకు వాడుతున్న ఆహార పదార్థాలు నాసిరకం అయితే రూ.5 లక్షలు జరిమానా గానీ 6 నెలలు జైలు శిక్ష గానీ వేసే అధికారం జాయింట్ లేదా అడిషినల్ కలెక్టర్ కు ఉంది. కానీ ఇప్పటి వరకూ ఎవరికీ జైలు శిక్ష పడలేదు. కేవలం వేలల్లో జరిమానా వేసి వాళ్ళని వదిలేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ ఆహారం తిన్న కస్టమర్లు అస్వస్థులైతే, బాధ్యులకు ఏడేళ్ళ దాకా శిక్ష వేయొచ్చు. ఎవరైనా చనిపోతే 10యేళ్ళ జైలు నుంచి జీవిత ఖైదు దాకా శిక్షలు ఉన్నాయి. వీటిల్లో ఏవీ అమలు కావడం లేదు.

చెకింగ్ అధికారులే లేరు

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మొత్తం 80 మంది ఉండాలి. కానీ 60 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో చూస్తే 200 మందికి పైగా అధికారులు ఉంటున్నారు. అంతేకాదు… తెలంగాణలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఒక్కటే ఉంది. నాచారంలో ఉన్న ఈ ల్యాబ్ లో జీహెచ్ఎంసీతో పాటు 33 జిల్లాల నుంచి వచ్చే శాంపిల్స్ ని టెస్ట్ చేయాలి. ఇక్కడ 100కు పైగా టెక్నీషియన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పనిచేస్తోంది 40 మంది లోపే. గ్రేటర్ పరిధిలో లక్ష దాకా హోటళ్ళు, రెస్టారెంట్స్ ఉంటే, కేవలం 30 మంది అధికారులు ఈ ఆహార కల్తీని ఎలా అరికడతారు అనేది ప్రభుత్వానికే తెలియాలి. ప్రజలకు రోగాలొస్తే బస్తీ దవాఖానాలు, కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టించి వైద్యం చేస్తామని సర్కార్ చెబుతోంది. కానీ కల్తీ ఆహారానికి కారణమవుతున్న వాళ్ళని మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తోంది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టులను భర్తీ చేసి, ల్యాబ్స్, టెక్నీషియన్స్ సంఖ్య పెంచాలి. జనానికి కల్తీ ఆహారం తినిపిస్తున్న హోటళ్ళ యజమానులకు శిక్షలు పడేలా చేయాలి.

ఆహార కల్తీపై ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకోవడం కాదు… కస్టమర్లు కూడా ఆలోచించాలి. సాధ్యమైనంత వరకూ బయటి ఫుడ్ తినడం మానేస్తే బెటర్. హైజనిక్ అని హంగామాతో భారీగా బిల్లులు బాదే రెస్టారెంట్స్ కి వెళ్ళినంత మాత్రాన సరిపోదు. అసలు అక్కడ ఆహారం ఎలాంటి పరిస్థితుల్లో వండుతున్నారన్నది కూడా చెక్ చేయాలి. రెస్టారెంట్స్ కిచెన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేసి జనానికి కనిపించేలా పెట్టాలని డిమాండ్ చేయాలి. కస్టమర్స్ అంతా ఇదే కోరుకుంటే, రెస్టారెంట్స్, హోటల్స్ మన డిమాండ్ కి దిగిరాక తప్పదు.

Read this also : వీటితో గుడ్ కొలెస్ట్రాల్ గ్యారంటీ !

Read this also : కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నజర్

Read this also : ఆంధ్ర నుంచి అన్నామలై – దక్షిణాదిపై మోడీ, షా ప్లాన్

Tagged