సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న (సోమవారం) ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సురానా ఇండస్ట్రీస్ మరియు సాయిసూర్య డెవలపర్స్తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ గుర్తించిన వివరాల ప్రకారం, మహేష్ బాబు ఈ కంపెనీల ప్రమోషన్ కోసం రూ.3.4 కోట్ల చెక్, రూ.2.5 కోట్ల నగదు సహా మొత్తం రూ.5.9 కోట్ల పారితోషికం తీసుకున్నారు. మనీ లాండరింగ్లో పాల్గొన్న ఈ సంస్థల్లో పెట్టుబడులకు ప్రజలను ప్రభావితం చేశారనే ఆరోపణలపై ఈడీ ఈ చర్య తీసుకుంది.
ఆరు రోజుల క్రితం ఈడీ సోదాలు
ఇటీవల, ఈడీ అధికారులు సురానా ఇండస్ట్రీస్ మరియు సాయిసూర్య డెవలపర్స్పై దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సాయిసూర్య డెవలపర్స్ ఎండీ సతీశ్ చంద్రగుప్త నివాసంలో కూడా నగదు సీజ్ చేశారు. ఈ సంస్థల కార్యాలయాల్లో పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో, వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో మోసం చేసిన ఆరోపణలతో సతీశ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది.
షెల్ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు
సురానా ఇండస్ట్రీస్ బ్యాంకు రుణాలను ఉపయోగించి షెల్ కంపెనీల ద్వారా నిధులను బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు తేలింది. సాయిసూర్య డెవలపర్స్ హైదరాబాద్లో అక్రమంగా భూముల అమ్మకాలు చేసినట్లు కూడా తెలిసింది. సురానా గ్రూప్ మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ దాడుల్లో వెల్లడైంది.
బ్యాంకు రుణాలు, సీబీఐ కేసు
సురానా గ్రూప్ చెన్నై ఎస్బీఐ నుంచి వేల కోట్ల రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించకపోవడంతో 2012లో సీబీఐ కేసు నమోదు చేసింది. దాడుల సమయంలో 400 కేజీల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్న సీబీఐ, తర్వాత 103 కేజీల బంగారం మాయమైనట్లు తెలిపింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు విచారణకు ఆదేశించింది. సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, పవర్ రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది.
ఈ కంపెనీలకు ప్రమోషన్ చేసిన మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Read this also : వీటితో గుడ్ కొలెస్ట్రాల్ గ్యారంటీ !
Read this also : హైదరాబాద్ లో గలీజ్ ఫుడ్.. తిన్నారంటే రోగాలే !
Read this also : కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నజర్