బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారిగా మెట్ గాలా 2025 వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొన్న మొదటి భారతీయ నటుడిగా శ్రేణిలో చేరారు. ఈ సందర్భంగా షారుఖ్ తన అనుభవాలను పంచుకుంటూ మాట్లాడుతూ, “మెట్ గాలా పేరు వినగానే మొదటిసారి భయమే వేసింది. నిజంగా ఈ ఈవెంట్కు ముందురోజు చాలా నర్వస్గా అనిపించింది. అసలు అక్కడ నుంచి తక్షణమే వెళ్లిపోవాలనిపించింది కూడా!” అని అన్నారు. అయితే ప్రముఖ డిజైనర్ సబ్యసాచీ దుబారాతోనే మెట్కు రావడానికి ధైర్యం చేసానని షారుఖ్ చెప్పారు.
“సబ్యసాచీ నన్ను పిలిచినప్పుడు, నా పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్ ముగ్గురూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. వాళ్లను చూసి నేనూ ఓకే అన్నాను. అసలు వాళ్లు నాకు మెచ్చి ‘వావ్’ అన్నారా, లేక నన్ను ఎలా చూస్తారో అని ఆశ్చర్యపడ్డారో తెలియదు,” అంటూ నవ్వారు షారుఖ్. ఈ వేడుకలో షారుఖ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ధరించిన పొడవైన బ్లాక్ కోటు, టస్మానియన్ సూపర్ఫైన్ ఉన్నితో తయారు చేసిన చొక్కా, ప్యాంట్తో పాటు మెడలో “K” అక్షరం ఉన్న లాకెట్, చేతిలో పులి తల ఆకారంలో ఉన్న కర్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డిజైనర్ సబ్యసాచీ మాట్లాడుతూ, “షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో ఒకరు. మేము ఆయనను బ్లాక్ డాండీగా చూపించాలనుకున్నాం. ఆయన శైలి, గౌరవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాం” అని తెలిపారు. షారుఖ్ మెట్ గాలాలో పాల్గొనడంపై ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.